Sep 10,2023 06:44

ఇప్పుడు ఐ.టి నోటీసులోనూ స్కిల్‌ కుంభకోణంలో వలెనే ఐ.టి విషయంలోనూ కేంద్రం తీవ్ర చర్య తీసుకుంటుందని వైసిపి ఎదురు చూసింది. అది జరక్కపోవడంతో ఎన్నికలు త్వరలో వచ్చేస్తాయి గనక తనే రంగంలోకి దిగింది. ఇదే వైఖరి ఇకముందూ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నది. వీటిపై తరచూ టిడిపి, జనసేన కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో పరిధిలో పదేపదే కేంద్రం జోక్యాన్ని ఆహ్వానించడం హానికరమైన విషయం. వీటిని అవకాశంగా తీసుకుని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావలసినవి కూడా నిరాకరిస్తున్నది. బిజెపితో ప్రతక్ష, పరోక్ష స్నేహాలు చేసిన పార్టీలు నేర్చుకోడానికి నిరాకరిస్తున్న గుణపాఠం ఇది.

ఏ కుంభకోణం లేదా అవినీతి, అక్రమాలు జరిగినా తప్పక విచారణ జరగవలసిందేగాని అవి కక్ష సాధింపు సాధనాలు కాకూడదన్నది ప్రజాస్వామిక సూత్రం, అమరావతిలోనైనా మరెక్కడైనా ఆరోపణలపై దర్యాప్తు, అరెస్టు అసలు జరగకూడదని కూడా ఎవరూ చెప్పలేరు. నిజానికి ఎ.పి హైకోర్టు, సుప్రీం కోర్టులే పలుసార్లు ఆ విషయం స్పష్టం చేశాయి. రాజధాని భూ లావాదేవీలపై విచారణకు సిట్‌ నియామకం చెల్లదని హైకోర్టు కొట్టివేస్తే సుప్రీం కోర్టు అనుమతించింది. ఒక ప్రభుత్వం తనకన్నా ముందు పాలించిన వారి హయాంలో ఏవైనా అక్రమాలు బయటపడితే విచారణ జరపాలి కదా అని వ్యాఖ్యానించింది. ఆ మేరకు పలు కేసుల దర్యాప్తు జరుగుతున్నది కూడా. అయితే రాజకీయ వైరాల కారణంగా వాటి వివరాలు లేదా అతిశయోక్తులు ముందే బయటికి లీక్‌ కావడం, కొన్నిసార్లు విషయాన్ని మించి కక్ష సాధింపునకు పాల్పడటం పరిపాటిగా మారుతున్నది.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసిపి, టిడిపి రాజకీయ కలహాలు పరాకాష్టకు చేరాయని చెప్పాలి. అటు చంద్రబాబు ఇటు మంత్రులూ తమ తమ కోణాల్లో అరెస్టు జరుగుతుందనే చెబుతున్నారు. రూ.371 కోట్ల ఎ.పి స్కిల్‌ స్కామ్‌లో ఆయనను అరెస్టు చేయవలసి వచ్చిందని సిఐడి, ప్రభుత్వం చెబుతున్నా ఈ కథ గతంలోనే మొదలైంది. చంద్రబాబుకు ఇన్‌కం టాక్స్‌ శాఖ నుంచి అప్రకటిత ఆదాయాలకు సంబంధించి నోటీసు వచ్చిందని హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రిక ప్రత్యేక కథనం ఇచ్చిన రోజు నుంచి ఊహాగానాలు, ఉద్రిక్తతలూ ముదురుతూ వచ్చాయి. నిజానికి ఇది 2019 అంటే చంద్రబాబు పాలనలో ఆఖరి సంవత్సరం అదీ ఎన్నికల ముందటి కాలానికి సంబంధించిన సమస్య. ఆ అప్రకటిత ఆదాయంపై 2020-21లో మదింపు వేసినప్పుడు అప్రకటిత మొత్తం వున్నట్టు గుర్తించామని ఐ.టి నోటీసు పేర్కొంది. అమరావతిలో నిర్మాణాలు చేసిన షాపుర్జీ పల్లంజీ సంస్థ సబ్‌ లీజ్‌దారైన ఎంవిపి తరపున మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని అనే మధ్య దళారీ నుంచి రాజకీయ విరాళంగా ఈ మొత్తం తీసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒత్తిడి చేసి తెప్పించినట్టు కూడా తెలిపింది. పార్థసానిపై ఐ.టి తనిఖీలు జరిపినప్పుడు ఈ వివరాలు తన ద్వారా తెలిశాయనీ, వివరమైన వాంగ్మూలం ఇచ్చాడని ఐ.టి హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ ఆఫీసు చంద్రబాబుకిచ్చిన నోటీసులో తెల్పింది. ఒక వ్యక్తిపై తనిఖీలు జరుపుతుంటే మరొకరి వివరాలు బయటపడితే 153(సి) కింద నోటీసు ఇవ్వడం పరిపాటి. ఈ నోటీసుపై చంద్రబాబు సాంకేతిక అభ్యంతరాలు తెల్పుతూ నాలుగు లేఖలు రాశారు. తనకు నోటీసు ఇవ్వాల్సింది జ్యుడిషియల్‌ అసెస్‌మెంట్‌ ఆఫీసర్‌ తప్ప ఈ కార్యాలయం కాదని వాదించారు. ఐ.టి నాలుగుసార్లు ఆయన వాదనను తోసి పుచ్చుతూ ఈ ఆగష్టు మొదట్లో మరో నోటీసు పంపి విచారణకు రావలసిన తేదీని నిర్దేశించింది. ఈ విషయం హిందూస్థాన్‌ టైమ్స్‌ రాసిన తర్వాత బయటికి వచ్చింది గానీ నిజానికి వైసిపి నేతలు ప్రభుత్వ ప్రతినిధులు చాలా కాలంగా ఇలాంటిది జరుగుతుందని చెబుతూ వచ్చారు. అయితే ఐ.టి కేంద్ర పరిధి లోది గనక వారి నిర్ణయం కోసం ఎదురుచూశారు. నోటీసు ఇవ్వడం తప్ప కేంద్రం ఎలాంటి చర్య కోసర ఆలోచించక పోవడం, ఈలోగా చంద్రబాబు బిజెపికి దగ్గర కావడానికి ప్రయత్నించడం వారిని నిరుత్సాహ పర్చింది. అందుకే ఈ సమయంలోనే ఇతర కుంభకోణాలను లేదా ఆరోపణలను తవ్వితీయడం మొదలెట్టారు. ఎ.పి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌, అమరావతి భూముల కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌, ఫైబర్‌ నెట్‌... ఇలా సిఐడితో ఒక జాబితా తయారు చేయించారు. వీటిలో కొన్ని దర్యాప్తులు, అరెస్టుల వరకూ వచ్చాయి. అందులో పెద్దదీ, సూటిగా దొరికింది స్కిల్‌ కుంభకోణం.
 

                                                                             ఏమిటీ కుంభకోణం ?

ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రత్యక్ష పాత్ర ఎంత, ఏమిటి అనే విషయం పక్కన పెడితే స్కిల్‌ స్కాం పెద్దదే. కొంచెం విపరీతమైంది కూడా. జిఎస్‌టి ఎగవేతలపై రైల్వేలకు సంబంధించి ఐటిఆర్‌సి ఆర్జా శ్రీకాంత్‌ అనే వ్యక్తిని 2017 చివరలో అరెస్టు చేసినపుడు అనుకోకుండా ఇది బయటికి వచ్చింది. అంటే అప్పటికి ఇంకా చంద్రబాబు అధికారంలో వున్నారు. అప్పుడప్పుడే బిజెపి కూటమి నుంచి బయటికి వచ్చే పరిస్థితి. ఈ కారణంగానే కేంద్రం దీన్ని కదిలించిందని, తనపై చర్య తీసుకోవచ్చనీ ఆయన భావించారు. తనను అరెస్టు చేయమని శాసనసభలో తీవ్ర ప్రసంగం చేయడం గుర్తుండే వుంటుంది. కారణాలేమైనా ఆ పని జరగలేదు. వై.ఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో దీన్ని మళ్లీ కదిలించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గానూ దానికి సంబంధించిన ఇతర వ్యవస్థలలోనూ కీలక పదవులు నిర్వహిస్తున్న గంటా సుబ్బారావు, ఐఎఎస్‌ మాజీ అధికారి లక్ష్మీనారాయణలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అప్పట్లో అది వివాదమైంది కూడా.
             జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరు చెప్పి ప్రభుత్వం నుంచి రూ.317 కోట్లు కొల్లగొట్టారనేది ఇక్కడ కేసు. సీమెన్స్‌ కంపెనీ మన యువత నైపుణ్య శిక్షణ కోసం రూ.3000 కోట్లు సహాయం చేస్తుందని, అందులో పదిశాతం మనం ఇస్తే సరిపోతుందని కథ మొదలైంది. కొన్నాళ్ల తర్వాత దానికోసం పదోవంతుగా రూ.300 కోట్లకు పైగా విడుదల అయింది. సీమెన్స్‌ ఇండిస్టీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నిధులు బదిలీ అయ్యాయి. అయితే అసలు సీమెన్స్‌ నుంచి రావలసిందేమీ రాలేదు. తమకు ఈ ఒప్పందంతో సంబంధమే లేదని సీమెన్స్‌ అధికారికంగా ప్రకటించింది. అంటే ఎవరో బోగస్‌ సంస్థతో ఆ మొత్తం తీసుకున్నారని స్పష్టమైంది. ఈ నిధుల విడుదలకు క్యాబినెట్‌ ఆమోదం లేదు. అప్పుడు ఫైనాన్స్‌ సెక్రటరీగా వున్న పి.వి రమేష్‌, సి.ఎస్‌ గా వున్న ఐ.వై.ఆర్‌ కృష్ణారావు ఇందుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి నోట్‌ రాసినట్టు కూడా నమోదైంది. అన్నిటినీ మించి తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సీమెన్స్‌ ప్రకటించింది. అంటే ఇదంతా మోసపూరితంగా జరిగిందని స్పష్టమైనట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో మనీ లాండరింగ్‌ కూడా వుంది గనక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగ ప్రవేశంచేసి నలుగురిని అరెస్టు చేసింది. కోర్టులోనూ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో 38వ నిందితునిగా చంద్రబాబు పేరుంది. అయితే అభియోగ కథనంలో మాత్రం ఆయన పాత్రను ముఖ్యంగా పేర్కొన్నట్టు సిఐడి వారు చెబుతున్నారు. ఆ వివరాలు అడిగితే 24 గంటల్లో ఇస్తామని చెప్పారు. ఐపిసి సెక్షన్‌ 50 కింద అరెస్టు చేసినపుడు కేసు వివరాలు ఆరోపణల పత్రాలు సమర్పించాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ముందే చెప్పినట్టు ఇతర కుంభకోణాలలో కూడా ఇదే విధమైన లింకులు వున్నట్టు, అవసరమైనదానికన్నా అధికంగానే ఆధారాలున్నాయని సిఐడి అధికారి సంజరు మీడియాకు చెప్పారు. వాటిపై కోర్టు స్పందనను బట్టి చంద్రబాబు రిమాండ్‌ సాధ్యమా కాదా అనేది ఆధారపడి వుంటుంది.
 

                                                                                 కేంద్రం కుటిలనీతి

ఏ కుంభకోణం లేదా అవినీతి, అక్రమాలు జరిగినా తప్పక విచారణ జరగవలసిందేగాని అవి కక్ష సాధింపు సాధనాలు కాకూడదన్నది ప్రజాస్వామిక సూత్రం, అమరావతిలోనైనా మరెక్కడైనా ఆరోపణలపై దర్యాప్తు, అరెస్టు అసలు జరగకూడదని కూడా ఎవరూ చెప్పలేరు. నిజానికి ఎ.పి హైకోర్టు, సుప్రీం కోర్టులే పలుసార్లు ఆ విషయం స్పష్టం చేశాయి. రాజధాని భూ లావాదేవీలపై విచారణకు సిట్‌ నియామకం చెల్లదని హైకోర్టు కొట్టివేస్తే సుప్రీం కోర్టు అనుమతించింది. ఒక ప్రభుత్వం తనకన్నా ముందు పాలించిన వారి హయాంలో ఏవైనా అక్రమాలు బయటపడితే విచారణ జరపాలి కదా అని వ్యాఖ్యానించింది. ఆ మేరకు పలు కేసుల దర్యాప్తు జరుగుతున్నది కూడా. అయితే రాజకీయ వైరాల కారణంగా వాటి వివరాలు లేదా అతిశయోక్తులు ముందే బయటికి లీక్‌ కావడం, కొన్నిసార్లు విషయాన్ని మించి కక్ష సాధింపునకు పాల్పడటం పరిపాటిగా మారుతున్నది. విశాఖలో ఈ తరహాలోనే గోడల కూల్చివేత, ఆక్రమణల తొలగింపు అంటూ దాడులు వివాదంగా మారాయి. ఏ కుంభకోణమైనా ఏ నాయకుడైనా విచారణకు అతీతం కాదని చెప్పవలసి వుంటుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ క్విడ్‌ప్రో కేసుల్లో 16 నెలలు అండర్‌ ట్రయల్‌గా వుండి బయటికి వచ్చారు. ఆ కేసుల విచారణ సాగుతూనే వుంది. మరోవైపున కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొలుపుతున్నదనే విమర్శలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇరువైపులా కూడా ప్రజాస్వామిక సూత్రాలు, నిబంధనలు, ప్రజా జీవితంలో జవాబుదారీ తనం సూత్రాల ప్రకారం వ్యవహరించవలసి వుంటుంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం అంతిమంగా అమలవ్వాల్సిన పరిస్థితి అనివార్యమే. ఈ వాదోపవాదాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలలో రాజకీయ పక్షాలు మునిగి తేలుతూ ప్రజా సమస్యలను మౌలికాంశాలనూ విస్మరించడం సరైంది కాదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేకించి ఎ.పి లో అధికార వైసీపీ ప్రతిపక్ష టిడిపిలను అవసరాన్ని బట్టి వాడుకుంటూ రాష్ట్రంతో చెలగాటమాడుతున్నది. ఈ కుంభకోణాల్లోనూ ఐ.టి, ఈడీ వంటివి ద్వంద్వనీతి పాటిస్తున్నాయి. ప్రాంతీయ పాలకులు తమ మనుగడ కోసం కేంద్రానికి పరస్పర ఫిర్యాదులతో కలహాలతో బిజెపికి పావులవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు అచ్చంగా వారి దోస్తీలోనే మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఐ.టి నోటీసులోనూ స్కిల్‌ కుంభకోణంలో వలెనే ఐ.టి విషయంలోనూ కేంద్రం తీవ్ర చర్య తీసుకుంటుందని వైసిపి ఎదురు చూసింది. అది జరక్కపోవడంతో ఎన్నికలు త్వరలో వచ్చేస్తాయి గనక తనే రంగంలోకి దిగింది. ఇదే వైఖరి ఇకముందూ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నది. వీటిపై తరచూ టిడిపి, జనసేన కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాల పరిధిలో పదేపదే కేంద్రం జోక్యాన్ని ఆహ్వానించడం హానికరమైన విషయం. వీటిని అవకాశంగా తీసుకుని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావలసినవి కూడా నిరాకరిస్తున్నది. బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష స్నేహాలు చేసిన పార్టీలు నేర్చుకోడానికి నిరాకరిస్తున్న గుణపాఠం ఇది. ఈ విధంగా రాష్ట్ర పార్టీల అవకాశవాద వ్యూహాలు, కేంద్ర బిజెపి ఆధిపత్య వ్యూహాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి రావడం విచారకరం. ఆ క్రమంలో ఉద్రిక్తతలు, అప్రజాస్వామిక పోకడలూ అసహనాలు అవాంఛనీయం.

తెలకపల్లి రవి

telakapalli ravi