
గ్యాస్ వినియోగం పెరిగేకొద్దీ సరఫరా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. పెరిగిన గ్యాస్ ధర మొత్తాన్ని సబ్సిడీగా నగదు రూపంలో బ్యాంకులో జమ చేస్తామని గ్యాస్ వినియోగదారులంతా బ్యాంకు ఖాతాలు తెరుచుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రకటించి ప్రజలను మభ్యపెట్టింది. క్రమంగా సబ్సిడీ మొత్తాన్ని కుదించి వేసింది. ఆ తరువాత సంవత్సరానికి రూ.పది లక్షల ఆదాయం వుండే గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదని 2015 డిసెంబర్ నెలలో నిర్ణయించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సబ్సిడీ గ్యాస్కు దూరమయ్యారు.
ధరలు పెంచడమే విధానంగా మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా గ్యాస్ ధర తగ్గించడం సామాన్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మహిళల కోసం రూ.వేల కోట్ల భారాన్ని మోడీ తలపైకి ఎత్తుకున్నారని ఆయన భక్తులు యథావిధిగా కీర్తిస్తోత్రాలు ఆలపిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కచెల్లెళ్లకు ఇది మోడీ కానుక అని ప్రభుత్వం ప్రకటించుకుంది. ఎవరు ఏమి చెప్పినా ఇన్నాళ్ళకు గ్యాస్ సిలిండర్ ధర కొంతైనా తగ్గడం ప్రజలకు కొంతమేరకు ఊరట. కలహ భోజన ప్రియడు ఏ కార్యమైనా ఊరికే చేయడు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 'ఇండియా' కూటమి సమావేశాలు, ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ వినియోగదారులు గ్యాస్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వంటి ముఖ్యమైన కారణాలు ఈ మాత్రం ధర తగ్గింపు వెనుక వున్నాయి.
కట్టెలు, బొగ్గుపైన తరతరాలుగా మన దేశ మహిళలు వంట చేస్తున్నారు. అయితే శాస్త్రవిజ్ఞానం పెరిగేకొద్దీ ప్రజా జీవన విధానంలోకి అనేక కొత్త వస్తువులు ప్రవేశిస్తాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు దశాబ్దాల నుండే గ్యాస్ను వంట సరుకుగా ఉపయోగిస్తున్నాయి. మన దేశంలో వ్యవసాయం ప్రధానంగా వుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వంటకు అవసరమైన కట్టెలు విస్తారంగా అందుబాటులో వుండడం, గ్యాస్ లభ్యత దేశంలో తక్కువగా వుండడం, విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి రావడం, గ్యాస్ వాడకం పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాలతో మన వంటింట్లోకి గ్యాస్ సిలిండర్ రావడం చాలా ఆలస్యమైంది. గ్యాస్ సిలిండర్ కావాలని పెళ్ళికి ముందు అర్జీ పెట్టుకుంటే అవ్వ, తాతలు అయిన తర్వాత వచ్చే పరిస్థితి గతంలో వుండేది. అర్జంట్గా అంటే అర్జీ చేసుకున్న కనీసం ఆరు నెలల నుండి సంవత్సరంలోపు గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీల సిఫారసు తప్పనిసరిగా అవసరమయ్యేది. దేశంలో ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత ప్రతిదీ సరుకుగా మారిన తర్వాత సరుకుల వినిమయం పెరిగింది. టి.వి, సెల్తో పాటు గ్యాస్ సిలిండర్ వాడకం కూడా వేగంగా పెరిగింది. నిత్య జీవితంలో వంటగ్యాస్ కీలక స్థానాన్ని ఆక్రమించింది. గ్యాస్ లేకుంటే వంట ఇల్లు బీడుగా మారే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సరుకుపై చమురు కంపెనీల దృష్టి పడింది. ప్రభుత్వాలు కూడా చమురు కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు చేయడం జరిగింది. లాభసాటిగా మారిన గ్యాస్ అమ్మకంలోకి అనేక కంపెనీలు జొరబడ్డాయి. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి.
గ్యాస్ సబ్సిడీ కోతలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం దేశంలో వంటగ్యాస్ వినియోగిస్తున్న కుటుంబాలు 2003-04లో 24.7 శాతం, 2015-16 నాటికి 44 శాతం, 2019-21 నాటికి 59 శాతంగా వున్నాయి. 2016 మే 1న ప్రారంభించిన 'ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన' పథకం పేరుతో దేశంలోని పేద కుటుంబాల మహిళలకు గ్యాస్ కనెక్షన్కు ఎలాంటి డిపాజిట్ లేకుండా ఇచ్చే పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూడా పరిస్థితి ఇది. అంటే ఇప్పటికీ 41 శాతం కుటుంబాలు వంట కోసం గ్యాస్ కాకుండా కట్టెలు, బొగ్గులు లేదా ఇతరత్రా వాటిని వాడుతున్నారు. దేశంలో 2019-20లో తలసరి గ్యాస్ వినియోగం 3.01 కిలోలు ఉండగా 2022-23 నాటికి 3.71 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో వంట గ్యాస్ వినియోగంలో చైనా అగ్ర భాగాన ఉంది. ఈ మాత్రమైనా గ్యాస్ వినియోగం పెంచింది మహిళల బాగుకోసమో, మహిళల కన్నీళ్ళు తుడవాడినికో అనుకుంటే పొరపాటు. గ్యాస్ వినియోగం పెరిగేకొద్దీ సరఫరా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. పెరిగిన గ్యాస్ ధర మొత్తాన్ని సబ్సిడీగా నగదు రూపంలో బ్యాంకులో జమ చేస్తామని గ్యాస్ వినియోగదారులంతా బ్యాంకు ఖాతాలు తెరుచుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రకటించి ప్రజలను మభ్యపెట్టింది. క్రమంగా సబ్సిడీ మొత్తాన్ని కుదించివేసింది. ఆ తరువాత సంవత్సరానికి రూ.పది లక్షల ఆదాయం వుండే గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదని 2015 డిసెంబర్ నెలలో నిర్ణయించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సబ్సిడీ గ్యాస్కు దూరమయ్యారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో గ్యాస్ సబ్సిడీలో రూ.30 వేల కోట్లు కోత విధించింది. ఈ విషయాన్ని స్వయానా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖా మంత్రి ఈ సంవత్సరం జులై 23న సిపిఎం రాజ్యసభ సభ్యులు ఎ.ఎ.రహీమ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వంటగ్యాస్ సబ్సిడీ కోసం రూ.37,209 కోట్లు కేటాయించగా, 2020-21 నాటికి ఈ సబ్సిడీని రూ.11,896 కోట్లకు, 2022-23 నాటికి రూ.6,965 కోట్లకు తగ్గించినట్లు ప్రకటించారు. దీనివల్ల 2014లో రూ.430 వున్న సిలిండర్ ధర 2018 నాటికి రూ.741, 2023 నాటికి రూ.1150కు పెరిగింది. గత తొమ్మిది సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడింది. సబ్సిడీలో కోతలు విధించి గ్యాస్ ధర పెరగడానికి కారణమైన కేంద్రం, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని, ప్రైవేట్ కంపెనీలు నష్టాలను భరించలేవు కదా అంటూ కపటపు మాటలు చెబుతున్నది.
గ్యాస్ సిలిండర్కు దూరమౌతున్న పేదలు
ఉజ్వల్ యోజన పథకం కింద ప్రస్తుతం 9.59 కోట్ల మంది నిరుపేద వినియోగదారులు వున్నారు. సహజంగానే పెరిగిన భారాన్ని వీరు మోయలేక గ్యాస్ వాడకం తగ్గించారు. ఉజ్వల గ్యాస్ వాడకందార్లు 2022-23 సంవత్సరంలో 1.15 కోట్ల మంది ఒక్క సిలిండర్ కూడా కొనలేకపోయారు. మరో 1.51 కోట్ల మంది సంవత్సరంలో కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే కొనగలిగారు. ఒకవైపు ధరల భారం ప్రజలపై మోపి మరోవైపు ప్రైవేట్ పెట్రోలియం కంపెనీలకు 2022లో రూ.22 వేల కోట్లు ఇచ్చి తన కార్పొరేట్ అనుకూల విధానాన్ని నగంగా అమలు చేస్తున్నది. మన దేశంలో వినియోగించే గ్యాస్లో 60 శాతం పైగా దిగుమతులపై ఆధారపడవలసి వస్తున్నది. ప్రపంచ చమురు ధరల్లో వచ్చే వ్యత్యాసం గ్యాస్ ధర పెరగడానికి కారణమైతే అక్కడ ధరలు తగ్గితే ఇక్కడ తగ్గాలి కదా! ఈ సంవత్సరం మార్చిలో ముడి చమురు టన్నుకు 732 డాలర్లు వుండగా జులై నాటికి 464 డాలర్లకు తగ్గింది. ఈ లెక్కన గ్యాస్ ధర రూ.400కు పైగా తగ్గాలి. కాని ఈ ఆగస్టు చివరి వరకు తగ్గించలేదు? రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొంత మొత్తాన్ని తగ్గించి అదో ఘనకార్యంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.
'ఇండియా' పట్ల భయంతోనే....
ఆకస్మిక నిర్ణయాలు చేయడం మోడీకి ఇష్టమైన విధానం. నోట్ల రద్దు, లాక్డౌన్, పాకిస్తాన్ పర్యటన, ఇప్పుడు గ్యాస్ ధర తగ్గింపు, పార్లమెంట్ అత్యవసర సమావేశాల నిర్ణయం ఇలా ఏదైనా సరే సంచలనంగా మార్చడం ఆయనకు ఆర్ఎస్ఎస్ నేర్పిన విద్య. ఇప్పటి వరకు తనకు ఎదురులేదని ఒకవైపు మతోన్మాదాన్ని, మరోవైపు కార్పొరేటు అనుకూల విధానాలను వేగంగా అమలు చేసిన బిజెపి, ఆర్ఎస్ఎస్ లను ప్రతిపక్షాల వేదిక 'ఇండియా' కలవరపెడుతున్నది. మరో ఐదు సంవత్సరాలు తానే ప్రధానమంత్రినని ఆగస్టు 15న అద్దె ఎర్రకోటపై ఎంతో గంభీరంగా ప్రకటించిన మోడీ ఇప్పుడు గాభరా పడుతున్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు గుర్తుకురాని ఎన్డిఏ పార్టీలతో సమావేశం కావడం, గ్యాస్ ధరను తగ్గించడం, జమిలి ఎన్నికలనడం, ఏకంగా దేశం పేరు ఇండియాను భారత్గా మార్చాలని ప్రయత్నించడం ఈ కలవరపాటులో భాగమే. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించారు. రానున్న కొద్ది మాసాల్లో ఇంకా ఎన్ని జిమ్మిక్కులు చూడాల్సి వస్తుందో.
/ వ్యాసకర్త సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్