Aug 13,2023 16:05

ఒక వస్తువుని దేశంలో ఎక్కడ కొని నష్టపోయినా మీ సొంత జిల్లాలోనే ఫిర్యాదు చేయొచ్చు.
ఫోన్‌ ద్వారా కంప్లైంటూ ఇవ్వొచ్చు. అది వినియోగదారుడి హక్కు..
వినియోగదారుల రక్షణ చట్టం మనదేశంలో 1986 డిసెంబర్‌ 24న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఏటా డిసెంబర్‌ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. సాంకేతికత పెరగడంతో డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, టెలి మార్కెటింగ్‌ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది. 2020 జులై 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త చట్టంలో ఈ కామర్స్‌ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు కూడా ఇది వర్తించనుంది.
వినియోగదారుల హక్కులు, ఆ హక్కులకు భంగం కలిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? నష్టపోతే పరిహారం ఎలా పొందాలి వంటి విషయాలను నిపుణులు ఇలా వివరించారు.
లాయర్‌ అవసరం లేకుండా నేరుగా వినియోగదారుడే ఫిర్యాదు చేయొచ్చు. జిల్లా స్థాయిలో కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ తీర్పుపై అసంతప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
వస్తువు ఎక్కడ కొన్నా సొంత జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు. దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే చోట అయినా, లేదా ఉద్యోగం చేసే జిల్లా కమిషన్‌లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. రూ.50 లక్షల విలువైన వస్తుసేవలకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ విలువజేసే కేసులను రాష్ట్ర కమిషన్‌లో విచారిస్తారు. రూ. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి యాప్‌ సౌకర్యం ఉంది. వెబ్‌సైట్‌ బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ-దాఖిల్‌ ((https://edaakhil.nic.in) అనే వెబ్‌సైట్‌/యాప్‌ అందుబాటులో ఉంది. నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌లైన్‌ ( ఎన్‌సీహెచ్‌) మొబైల్‌ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయొచ్చని సంబంధిత నిపుణులు చెప్తున్నారు.

ఫోన్‌లో కూడా ..

'ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. అదెలా అంటే.. 1915, 1800114000 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి, సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు. వస్తువు కొనేటపుడు బిల్లు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది.
వినియోగదారుల కమిషన్‌ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి. ఉదాహరణకు రైలు టిక్కెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా ఫిర్యాదు చేయొచ్చని నిపుణులు చెప్తున్న మాట.
ఇంకే మరి.. ఇక నిశ్చింతగా ఉండండి.. మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నా.. మీ సొంత జిల్లాలో ఫిర్యాదు చేసి, పరిహారం పొందండి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. కొన్నందుకు నష్టపోతే పరిహారం పొందాల్సిందే కదా!