Oct 29,2023 16:43

ఆలమూరు : ఒకటి కాదు రెండు కాదు 40 ఏళ్ల తర్వాత కలిశారు వారంతా నిన్నటివరకు పెద్దతరహగా ఉన్న వీరు ఒక్కసారిగా చిన్నపిల్లల అయ్యారు. బట్ట బుర్రలు, బాన పొట్టలు, బోడి గుండులు వేసుకుంటూ వచ్చేసారు నాటి మగ ధీరులు..! బారెడు జడ మూరెడు అయినా వయసు పైబడి వన్నెతగ్గినా వాడి తగ్గకుండా విచ్చేసారు ఆనాటి, నేటి నారీమణులు..! పూర్వ విద్యార్థుల కలయిక అనగానే ఎగురుకుంటూ..! ఏదో లోకాల్లో తేలిపోతూ..! ఒరేరు, తురేరు, వాడు, వీడు, ఏమే, ఒసే అనుకుంటూ, కలబడుతూ..!కౌగలించుకుంటూ..! జ్ఞాపకాల పుస్తకాల పేజీలను గబగబా తడిమేసుకుంటూ..! తాటాకు పాకలలో ఇసుక నేలపై కూర్చుని చదువుకున్న రోజులను గుర్తుకొస్తున్నాయంటూ పాటలు పాడుతూ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆనాటి స్నేహితులు చెప్పుకున్న ఆనాటి ఊసులు.. మదిలో సిరి మువ్వల సవ్వడులై గిలిగింతలు పెట్టించాయి. అలాగే అప్పటి ముచ్చట్లు నవ్వుల పువ్వులు పూయించాయి. మరిచిపోయిన జ్ఞాపకాల దొంతరలు మదినిండా సంతోషాన్ని నింపాయి. ఆప్యాయంగా పిలుచుకునే పిలుపులు మనసు పొరల్లో దాగిన ప్రేమ గాఢతను బయటకు వెదజల్లాయి. గురువులు చేత తిన్న తిట్లు చిన్నచిన్న దెబ్బలు తలుసుకుంటూ వారంతా మా భవిష్యత్తంతా మీరిచ్చిందే కదా మాస్టారూ అంటూ ఆ నాటి గురువులకు పాదాభివందనాలు చేసుకున్నారు. 1977 నుండి 1982 సంవత్సరం వరకు ఆలమూరు మండలం చెముడులంక ఎస్టిఎస్‌ఎన్‌ఎం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు ఐదేళ్లు పాటు కలసి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమ్మేళనం ఆదివారం జరిగింది. సుమారు 47 మంది మిత్రుల్లో ఇన్నేళ్ల తర్వాత 40 మంది కుటుంబ సభ్యులతో వచ్చి ఆ'పాత' మధురాలను పంచుకున్నారు. తమను తాము పరిచయం చేసుకుంటూ తరగతి గదుల్లో చేసిన అల్లరి చేష్టలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. శాలువాలు, పూలదండలు, కానుకులతో తమ గురువులను సత్కరించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఇటీవల కాలంలో అకాల మఅతి చెందిన సహచరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు.
సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తులుగా జీవించి విద్య నేర్చుకున్న పాఠశాలకు, నేర్పిన గురువు లకు, పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని విశ్రాంతి ఉపాధ్యాయులు సూచించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సత్కారం పొందిన రామలింగేశ్వరరావు మాస్టారు (సైన్స్‌, లెక్కలు), కీర్తి రామం మాస్టారు (సోషల్‌ స్టడీస్‌), గన్ని ప్రసాద్‌ మాస్టర్‌ (ప్రధానోపాధ్యాయులు) తమ స్పందనను తెలిపారు. తామంతా విలువలతో కూడిన విద్యనందించేందుకు ఎల్లప్పుడూ కఅషి చేశామని, ఆ విలువలను కాపాడే బాధ్యత శిష్యులందరిపై ఉందన్నారు.
పూర్వ విద్యార్ధుల కలయిక కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజాహిత కార్యక్రమాలకు ఒకరికొకరు సహకరించుకునే విధంగా చేయూత నివ్వాలని పూర్వ విద్యార్థులు అన్నారు.