Oct 28,2023 15:45

హైదరాబాద్‌: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన 'మీట్‌ ది ప్రెస్‌'లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ బూటకపు హామీలు ఇస్తోందని ఆరోపించారు. కర్ణాటకను మోడల్‌ గా చూపుతూ కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతున్నారు.. కానీ, అక్కడి రైతులేమో కాంగ్రెస్‌ తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారని చెప్పారు. మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సఅష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు అభివృద్ధిపై విజన్‌ లేదని విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్‌ తెలంగాణలోనే ఉందని వెల్లడించారు.