విజయవాడ: దేవి శరన్నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ..''అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా రెండు విషయాలు అమ్మవారిని కోరుకున్నాను. తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు.అమ్మవారు దయ చూపి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, తెలుగు జాతి ముందుండాలని పరితపించిన వ్యక్తిని, త్వరగా విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నాను. ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యంలాగా చంద్రబాబు బయటకు వస్తారు'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.










