Nov 02,2023 14:24

అమరావతి: రాష్ట్ర సెక్రటేరియట్‌లో ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్‌ అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు రివిజన్‌ ఆఫ్‌ ప్యానెల్స్‌ విషయంలో ఐఏఎస్‌తో మరొక కొత్త కమిటీ నియామకం జరుగనుంది. ఈ మేరకు త్వరలో జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే కాలయాపన కోసమే కమిటీలు అని ఉద్యోగులు వాపోతున్నారు. 2018లో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను ఈరోజు వరకు అమలు చేయలేదంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో తీరని అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సెక్రటేరియట్‌ ఓసీ, బీసీ ఎంప్లాయిస్‌ అసోసియేష్‌ హైకోర్టులో కంటెంప్ట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వేసిన తర్వాత లా డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక సలహా కమిటీ ప్రభుత్వం నియమించింది. ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు దీర్ఘకాలంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేశాక కూడా మరో కమిటీ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఇది కాలయాపన చేయడమే అని ఉద్యోగులు చెబుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ సచివాలయ ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేశారు.