Jun 19,2022 12:10

'జన గణ మన' అనే సినిమా రెండు మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. విభిన్న కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే మలయాళ సినీ ఇండిస్టీ నుంచి ఈ చిత్రం విడుదలైంది. అందులోనూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌, డైరెక్టర్‌గా లూసీఫర్‌ వంటి చిత్రాలతో అలరించిన పృథ్వీరాజ్‌ తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఇంతలా జనాలను ఆకట్టుకుంటున్న 'జన గణ మన' కథ ఏంటో? ఓ సారి చూద్దాం..!

టైటిల్‌ : జన గణ మన (2022)
నటీనటులు : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, సూరజ్‌ వెంజరమూడ్‌, మమతామోహన్‌ దాస్‌, జీఎమ్‌ సుందర్‌ తదితరులు
కథ : షరీస్‌ మహమ్మద్‌
దర్శకత్వం : డిజో జోస్‌ ఆంటోని
సంగీతం : జేక్స్‌ బిజోరు
నిర్మాతలు : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, లిస్టిన్‌ స్టీఫెన్‌
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్‌

కథలోకి వెళ్తే... యూనివర్సిటీ లెక్చరర్‌ అయిన సభా మరియం (మమతా మోహన్‌దాస్‌) ను రేప్‌ చేసి, బాడీని కాల్చి చంపేశారంటూ మీడియాలో నేషనల్‌ హెడ్‌లైన్‌ అవుతుంది. తమ ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని నిరసనకు దిగుతారు యూనివర్శిటీ విద్యార్థులు. మరోపక్క సభా మరియం తల్లి సైతం న్యాయం కోసం పోరాడుతుంది. ఇక ఈ కేసును ఛేదించేందుకు ఏసీపీ సజ్జన్‌ (సూరజ్‌ వెంజనమూడు) ను రంగంలోకి దించుతుంది ప్రభుత్వం. ఆందోళన చేస్తున్న విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తాడు సజ్జన్‌. కేసును టేకప్‌ చేసిన 24 గంటల్లోనే ఓ నలుగురు నిందితులను అరెస్టు చేస్తాడు. మరోపక్క సీక్రెట్‌గా నిందితులను విచారిస్తుంటారు. దోషులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మీడియా ద్వారా వార్త లీకవుతుంది. బాధితులు, విద్యార్థుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏసీపీ సజ్జన్‌ ఆ నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. యావత్‌ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో సజ్జన్‌పై మానవహక్కుల కమిషన్‌ విచారణకు ఆదేశిస్తుంది. న్యాయవాది అరవింద్‌ స్వామినాథన్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) కేసు వాదిస్తాడు. ఏసీపీ సజ్జన్‌ చేసిన ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నిలబడతాడు అరవింద్‌. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఆ ఎన్‌కౌంటర్‌ ఎందుకు చేశారు? కోర్టులో లాయర్‌ అరవింద్‌ సంధించిన ప్రశ్నలు ఏంటి? సభా మరియం ఎలా చనిపోయింది? ఆమె చావు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? దాని వెనుకున్నది ఎవరు? అనే విషయాలు ఎలా బయటకు వచ్చాయి? అనేదే మిగిలిన కథ.

'జన గణ మన' సినిమాతో వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించేడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు మనకు దిశ సంఘటనే గుర్తుకొస్తుంది. సమాజంలోని విద్యా, న్యాయ, పోలీసు, రాజకీయవ్యవస్థ ఇలా అన్నింటి మీద ప్రశ్నలు కురిపించాడు. వాటి ఉనికి మీదే అనుమానం కలిగించాడు. ప్రస్తుత సమాజంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూపించాడు. ఈ వ్యవస్థల్లో సైతం వర్ణ వివక్ష, కుల, మత, జాతి బేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టాడు. ఓ రైతు బిడ్డ రైతుగానే మిగిలిపోవాలా? ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తే నేరమా? వెళ్లనివ్వదా? అంటూ సూటిగా ప్రశ్నించాడు. విద్యావ్యవస్థలోని లోపాలను, విద్యార్థి లోకాన్ని రాజకీయాలకు ఎలా వాడుకుంటారో స్పష్టంగా తెరకెక్కించారు.

ఇక కార్పొరేట్‌ మీడియా చేసే రాద్దాంతం మీద ఘాటుగా చురకలు అంటించాడు. ప్రజల మూడ్‌ను కంట్రోల్‌ చేసే విధానంపై సెటైర్లు వేసినట్టు ఉంది. ప్రజలు నిజాలను మరిచిపోయి.. మీడియా చూపించేదే నిజమేమో అని భ్రమపడేలా చేస్తోన్న విధానం ఎండగట్టాడు. సమాజంలో కార్పొరేట్‌ మీడియా పోషిస్తోన్న పాత్రను, రాజకీయ నాయ కుల చేతిలో కీలుబొమ్మగా మారిన వైనాన్ని ఎండగట్టాడు.
ఇక పోలీసువ్యవస్థ మీదా చురకలు అంటించాడు. ఎన్‌కౌంటర్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది.. దిశ లాంటి ఓ ఘటన జరిగితే.. సమాజం ఎలా స్పందిస్తుందో చూపించాడు. చివరికి వారిని ఎన్‌కౌంటర్‌ చేసేస్తారు. కానీ వాళ్లు ఆ తప్పు చేశారా? లేదా? అని ఏ ఒక్కరూ ఆలోచించరు. ఇదే విషయాన్ని లాయర్‌ అరవింద్‌ ప్రశ్నిస్తే.. వాళ్లను చూస్తేనే తెలుస్తుంది? అని జడ్జి చెప్పడం. రంగు, రూపం, వేషధారణ బట్టి చేస్తారా? అంటూ ప్రశ్నించడం హైలెట్‌. లాయర్‌ అరవింద్‌ కోర్టులో ఇలా వాదిస్తున్నాడేంటి అని మొదట్లో అనిపించినా.. కథ నడుస్తున్న కొద్దీ అసలు విషయాలు బయటకొస్తాయి. మొత్తానికి ఇది అంతం కాదు ఆరంభం అంటూ చివర్లో వదిలిన క్లూతో.. సీక్వెల్‌ మీద అంచనాలు పెంచేశాడు.

సమాజంలో నెలకొన్న పరిస్థితులను ధైర్యంగా చూపించిన డైరెక్టర్‌ డిజో జోస్‌ ఆంటోనికి, సినిమా నిర్మించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను అభినందించాల్సిందే. కథకుడు షరీఫ్‌ మహమ్మద్‌కు, జేక్స్‌ బిజోరు సంగీతానికి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, సూరజ్‌ వాళ్ల నటనతో అదరగొట్టారు. ప్రొఫెసర్‌ సబా మరియంగా మమత మోహన్‌ దాస్‌ సెటిల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. కోర్టు సీన్‌లో సన్నివేశాలు, డైలాగ్‌లు హైలెట్‌. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా మాత్రమే కాదు, సమాజానికి ఓ కనువిప్పు ఈ 'జన గణ మన'.