Aug 23,2022 12:43

హైదరాబాద్‌ : మరో 4 రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా ... టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్‌ ద్రవిడ్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వుంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ సమయానికి రాహుల్‌ ద్రవిడ్‌ కోలుకోకపోతే అతడి స్థానంలో కోచ్‌గా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చైర్మన్‌(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే పాక్‌తో తొలి మ్యాచ్‌ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్‌ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన టీమ్‌ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడిన కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, దీపక్‌ హుడాలు యూఏఈలో భారత జట్టుతో కొంచెం ఆలస్యంగా కలవనున్నారు. ఇప్పటికే భారత బౌలర్లు బుమ్రా, హర్షల్‌ పటేల్‌ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యారు. ఒకవేళ సమయానికి కోచ్‌ ద్రవిడ్‌ రాలేకపోతే జింబాబ్వేతో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌ ఆసియా కప్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.