
భిన్న రకాల ప్రజలు, కమ్యూనిటీలు, సాంప్రదాయాలు, భాషలు కలిగిన ఈ నేలలోని వైవిధ్యతలోనే ఏకత్వం వుందన్నది...గతంలో అందరినీ సమైక్యపరిచే సందేశంగా వుంది. కానీ, ఇప్పుడు ఏకత్వంతో ఐక్యతను మోపడమన్నది లక్ష్యంగా వుంది. భారతదేశం యొక్క విశిష్టమైన వైవిధ్యత లక్షణాన్ని తుడిచిపెట్టేందుకు సజాతీయత అన్న ముద్ర వేస్తున్నారు.
'ఒక దేశం, ఒక పన్ను', ఒక దేశం ఒక రేషన్ కార్డు' ఇలా ఏకత్వాన్ని విధించే ఇటువంటి ఎజెండాల కన్నా 'ఒక దేశం, ఒక ఎన్నిక' అన్న ఎజెండా చాలా ముందుకు సాగుతోంది. దీన్ని అమలు చేసినట్లైతే, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పాలనాపరమైన, రాజకీయ పరమైన అధికారాల కేంద్రీకరణ శాశ్వతంగా అనేక రెట్లు పెరుగుతుంది. తదనుగుణంగా రాష్ట్రాలు బలహీనపడతాయి.
'ఏక కాలంలో ఎన్నికలు' అంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండా 'ఏకత్వాని'కి సంబంధించిన మిగిలిన అన్ని ఆలోచనల కన్నా చాలా వేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో మరింత కేంద్రీకరణ ధోరణి గోచరిస్తోంది. 2024లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కొత్త పల్లవి మొదలెట్టారు. 1999 నుండి అనేక కమిటీలు ఈ ప్రతిపాదనను పరిశీలించాయి. ప్రతి ఐదేళ్ళకోసారి ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తూ, దాన్ని శాశ్వతం చేయడానికి ఊపునిచ్చే ఆలోచనలు గత దశాబ్ద కాలం నుండి వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా ఈ ఆలోచన గురించి మాట్లాడుతున్నారు. అయితే, మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఉన్నత స్థాయిలో ఒక కమిటీని వేయడం బహుశా ఇదే మొదటిసారి. మాజీ రాష్ట్రపతిని ఈ కమిటీకి నియమించడమనేది అసాధారణ నియామకమే. అయితే, కమిటీ చేసిన సిఫార్సుకు ఒక చట్టబద్ధత ముద్ర వేయడానికి ఈ నియామకం ఉద్దేశించినట్లు కనిపిస్తోంది.
ప్రచారం వెనక దాగిన వాస్తవం
'ఒకే దేశం' అంటూ 2014 నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఈ ప్రతిపాదన అత్యంత కీలకమైనది. ఇది అమలు చేసినట్లైతే, న్యూఢిల్లీ లోనే మరింతగా అధికారాలు కేంద్రీకృతమవుతాయి. అధికారంలో వున్న జాతీయ పార్టీల పట్టు మరింత బలోపేతమవుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత కుదించబడుతుంది. ఏక కాలంలో ఎన్నికల వ్యవస్థను క్రోడీకరించడానికి, అమలులోకి తీసుకురావడానికి వెనుకగల తక్షణ రాజకీయ ప్రయోజనం ఇదే.
ఎన్నికల వ్యయాన్ని ఆదా చేయడం, ఎన్నికల సమయంలో పాలనా యంత్రాంగం పని తీరుకు ఆటంకం కలగకుండా నివారించడం అన్న ముసుగు చాటున ఈ ఆలోచనను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడో అక్కడ ఏడాది పొడుగునా ఎన్నికలు జరుగుతుంటాయని, దానివల్ల కఠోర శ్రమకు, సుపరిపాలనకు ఆటంకం కలుగుతోందని, పైగా ఈ ఎన్నికల వ్యయాన్ని మనం భరించలేకపోతున్నామని చేస్తున్న వాదన పైకి చాలా సరళమైనదిగానే కనిపిస్తోంది. పైగా అధికార యంత్రాంగం పని తీరుతో, పట్టించుకోని ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తిగా వున్న ఒక వర్గం ఓటర్లను ఉద్దేశించి చేసే వాదనగా ఇది వుంది. అయితే, ఇటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల తలెత్తే ప్రతికూల పర్యవసానాలు, తప్పుడు హేతువులు ఈ రెండింటినీ ఎత్తి చూపిస్తూ స్వతంత్ర వ్యాఖ్యాతలు చేసే విశ్లేషణ గణనీయమైన భాగంగా వుంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వ్యయ భారమనేది ఇటువంటి మార్పు తీసుకువచ్చేంత పెద్దదిగా అయితే లేదు. ఎన్నికల ముందు పాలనకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డురావాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నపుడు పాలన ప్రభావితం అవుతుంది. అయితే, ఇది కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ ఎప్పుడూ ఎన్నికలలో మునిగి తేలుతుంటేనే జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో వున్న పాలక పార్టీ లేదా సంకీర్ణం జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే వాటి ప్రభావం ఏదో ఒక రాష్ట్రంలో వుంటుందనే భయంతో నిర్ణయాలు తీసుకోవడానికి తిరస్కరించినపుడు, ఆ పాలనకు ఆటంకం కలుగుతుంది. పైగా మున్సిపల్ ఎన్నికల నుండి ప్రతీ ఎన్నికను కూడా తప్పనిసరిగా గెలవాల్సిన ఎన్నికగానే పాలక పార్టీ చూస్తున్నపుడు, పార్టీ సీనియర్ కార్యకర్తలందరినీ ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరినపుడు ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుంది (ఈ ఆలోచనపై విస్తృతంగా జరిగిన చర్చలో 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై.వి.రెడ్డి ఈ అంశాన్ని ఐదేళ్ల క్రితమే ప్రస్తావించారు. ఎన్నికలను ప్రభుత్వాలు తమ పాలనకు జవాబుదారీగా చూసేందుకు ఉద్దేశించబడ్డాయి. అయినా అవి తరచుగా జరుగుతున్నపుడు తమ పాలనకు ఆటంకం కలిగించాయంటూ వారు తప్పుబడతారు.).
సమాఖ్యవాదానికి భిన్నమైనది
లోక్సభతో కాకుండా అసెంబ్లీ ఎన్నికలు విడిగా నిర్వహించినపుడు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం తక్కువగా వుందని 1971, 2004 మధ్య నమోదైన ఓటింగ్ శాతంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం వివరాలను సాక్ష్యాధారంగా చూపిస్తూ ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం చట్టపరంగా తప్పనిసరి అంటూ ఒక వాదన తెర పైకి వస్తోంది. అయితే, ఏక కాలంలో ఎన్నికల ఆలోచనను హేతుబద్దం చేసే వాదన మాత్రమే ఇది. అధికంగా ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడమన్నది స్వాగతించదగ్గ పరిణామమే, కానీ దాన్ని ఇతర మార్గాల ద్వారా పెంచడానికి చూడాలి తప్ప రాజ్యాంగ అంగాలను తలకిందులు చేసే చర్యలతో కాదు.
అనేకమంది మేధావులు, వ్యాఖ్యాతలు కూడా ఇదే అంశాన్ని ఏదో ఒక రకంగా ఎత్తిచూపారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే చట్టసభ యొక్క రాజ్యాంగ నిబంధనలు, నియమాలకు పెద్దఎత్తున రాజ్యాంగ మార్పులు చేయాల్సిన అవసరం వుంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితిని కుదించడం లేదా పొడిగించడమన్నది మొదటి దఫా చేయాలి. ఆ తర్వాత, ఏక కాలంలో ఎన్నికల నిర్వహణ అనేది శాశ్వత అంశంగా చేయాలి. అంటే నిర్దిష్టమైన కాల పరిమితితో కూడిన ప్రభుత్వాలు వుండాల్సిన అవసరముంది. లేదా అవిశ్వాస తీర్మానాలకు కాలం చెల్లినట్లు భావించాల్సి వుంది. లేదా ప్రభుత్వాలను గద్దె దించే భారీ మెజారిటీలు వుండాలి. లేదా రాష్ట్రపతి, గవర్నర్ల చేతుల్లో మరిన్ని అధికారాలు వుండాలి. లేదా ఈ గణనీయమైన మార్పులన్నింటి సమాహారంగా వుండాలి. ఈ మార్పులు అమల్లోకి వస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపం మారుతుంది. పైగా ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తగ్గిస్తుంది. సమాఖ్యవాదం ఆలోచనకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగులుతుంది. మరోపక్క న్యూఢిల్లీలో అధికార కేంద్రీకరణ పెరుగుతుంది.
వైవిధ్యతను రూపుమాపేందుకే...
ఒకే ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక నేత మాత్రమే భారతదేశాన్ని మార్చగలరనే సందేశంతో కూడిన రాజకీయ ప్రాజెక్టులో భాగమే ''ఒక దేశం, ఒక పన్ను'' ఎజెండా.
భిన్నత్వంలో భారతదేశ బలాన్ని నిరాకరించే విస్తృతమైన సైద్ధాంతిక ఎజెండా ఇందులో వుంది. దీనికి బదులుగా ప్రబలంగా వున్న ఒక మతంతో ఒక దేశం, ఒక ప్రబమైన భాష లేదా ఒక మతం, ఒక భాషతో ఒక దేశంగా-పూర్తి సజాతీయ తతో కూడిన దేశంగా పరిగణిస్తోంది. భిన్న రకాల ప్రజలు, కమ్యూనిటీలు, సాంప్రదాయాలు, భాషలు కలిగిన ఈ నేలలోని వైవిధ్యతలోనే ఏకత్వం వుందన్నది...గతంలో అందరినీ సమైక్యపరిచే సందేశంగా వుంది. కానీ, ఇప్పుడు ఏకత్వంతో ఐక్యతను మోపడమన్నది లక్ష్యంగా వుంది. భారతదేశం యొక్క విశిష్టమైన వైవిధ్యత లక్షణాన్ని తుడిచిపెట్టేందుకు సజాతీయత అన్న ముద్ర వేస్తున్నారు.
వందేళ్ళ నాటి సైద్ధాంతిక కార్యక్రమం వున్న రాజకీయ పార్టీకైనా కూడా ఇదేమీ పూర్తి చేయగలిగే సులభమైన పని కాదు. అయితే, వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఒక నాగరికత స్వభావాన్ని పార్లమెంట్లో తనకున్న సంపూర్ణ మెజారిటీతో ఏదో ఒక ప్రభుత్వం కొద్ది పదవీ కాలాల్లో మార్చివేయలేదు. అయితే, ఇది ప్రయత్నించడం కోసం కాదు.
'ఒక దేశం, ఒక పన్ను', ఒక దేశం ఒక రేషన్ కార్డు' ఇలా ఏకత్వాన్ని విధించే ఇటువంటి ఎజెండాల కన్నా 'ఒక దేశం, ఒక ఎన్నిక' అన్న ఎజెండా చాలా ముందుకు సాగుతోంది. దీన్ని అమలు చేసినట్లైతే, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పాలనాపరమైన, రాజకీయ పరమైన అధికారాల కేంద్రీకరణ శాశ్వతంగా అనేక రెట్లు పెరుగుతుంది. తదనుగుణంగా రాష్ట్రాలు బలహీనప డతాయి.
గత పక్షం రోజులుగా ముమ్మర రాజకీయ కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న క్రమంలో మనం వున్నాం. ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశాల ఎజెండా ఏమిటనేది ఇప్పటి వరకు నిర్ణయించ లేదు (వ్యాసం రాసే సమయానికి). ఇది, చర్చ జరగకుండా చట్టాన్ని రూపొందించడానికి మాత్రమే ఆసక్తిని చూపే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అసాధారణ సమావేశం కానుంది. 'భారత్' గురించి మనం పదే పదే నినాదాలు వింటున్నాం. ఇప్పుడు ఇండియా, భారత్ అంటున్నాం, ఇకనుండి అధికారికంగా భారత్ అని మాత్రమే పిలుస్తారో లేదో తెలియదు. 2014 నుండి పదే పదే చెప్పుకుంటూ వస్తున్న ఏక కాల ఎన్నికల నిర్వహణకు కొత్త ఊపునివ్వడం కోసం జరుగుతున్నదే ఇదంతా. ఏక కాల ఎన్నికల నిర్వహణపై ఉన్నత స్థాయి కమిటీ ఎప్పుడు, ఏమని సిఫార్సు చేస్తుంది? ఆ కమిటీ ప్రస్తావనాంశాలు ఏమిటో, పాలక పార్టీ కోసం ఏం సిద్ధం చేస్తోందో కూడా మనం ఊహించ లేము (ప్రతిపక్షాల నుండి ఒకే ఒక్క సభ్యుడు వున్నారు. ముందస్తు చర్చలు, సంప్రదింపు లు లేకుండా ఆకస్మికంగా ప్రకటించడంతో ఆ కమిటీకి దూరంగా వుండడం తప్ప ఆ సభ్యుడు చేసేదేమీ లేదు).
చివరి మాట...
ఇటువంటి రాజ్యాంగ విధ్వంసాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి? పార్లమెంట్ను తటస్థీకరించారు, న్యాయ వ్యవస్థకు వెన్నెముక లేకుండా పోయింది. మీడియా విధేయతతో వుంటోంది. నాగరిక సమాజం నీరసంగా తయారైంది - వంటివేవీ కూడా ప్రభుత్వ ఆలోచనలను, ప్రణాళికలను సమర్ధవంతంగా ప్రతిఘటించలేవు. 'ఒకే దేశం' అన్న ఈ ఆలోచనతో కలిసి జీవించాలనుకుంటున్నారా? లేదా? అనేది నిర్ణయించగలిగే శక్తిసామర్ధ్యాలు ఇక కేవలం ఓటర్లుకు మాత్రమే వున్నాయి.
( వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్. హిందూ సౌజన్యంతో )
సి. రామ్ మనోహర్ రెడ్డి