Sep 15,2023 07:04

          దేశంలో యాపిల్‌ పంట కోతకు వస్తున్న సమయంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌పై సుంకంలో 20 శాతాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వాషింగ్టన్‌ యాపిల్స్‌పై 2019 నుంచి అమల్లో ఉన్న 70 శాతం సుంకంలో 20 శాతం తగ్గిస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించగా న్యూఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ-బైడెన్‌ ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఈ నిర్ణయం ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చింది. యాపిల్స్‌, వాల్‌నట్స్‌ (అక్రోటు), బఠానీలు, ఇతర పప్పుదినుసుల వంటి అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకంలో కోత విధించారు. ఉక్కు, అల్యూమినియం వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను 2019లో అమెరికా సుమారు 25 శాతం పెంచిన దానికి ప్రతిగా భారత్‌ అమెరికా నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్‌ వంటి వాటిపై సుంకాలను పెంచింది. దీంతో భారత్‌కు అమెరికా నుంచి యాపిల్స్‌ దిగుమతులు భారీగా తగ్గాయి. 2018-19లో అమెరికా నుంచి సుమారు 145 మిలియన్‌ డాలర్ల విలువైన యాపిల్స్‌ దిగుమతి కాగా, 2022-23 నాటికి 5.27 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. మొత్తం పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అమెరికాను సంతృప్తిపర్చడానికే ఈ నిర్ణయం జరిగిందని విదితమవుతోంది. మోడీ సర్కారు దేశీయ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాకు చెందిన కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే పరమావధిగా వ్యవహరించడం దారుణం.
          ఇప్పటికే పంట సాగు వ్యయం పెరగడం, అననుకూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు సోకడం, సరైన మద్దతు ధర లేక, దళారుల దోపిడీ వంటి వాటితో జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని యాపిల్‌ రైతులు విలవిలలాడుతున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలోనే వాషింగ్టన్‌ యాపిల్స్‌ కూడా భారతీయ మార్కెట్లోకి తక్కువ ధరకు లభిస్తే దేశీయ యాపిల్స్‌ పరిస్థితి ఏమిటి? యాపిల్‌ సాగులో అధునాతన సాంకేతికతను వినియోగించడంతోపాటు అక్కడి ప్రభుత్వాలు రాయితీలివ్వడంవల్ల అమెరికాలో యాపిల్‌ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. అలాంటి కార్పొరేట్లతో మన దేశంలోని సన్న చిన్నకారు రైతాంగం ఎలా పోటీ పడగలరు? ఇక దిగుమతి సుంకాన్ని సైతం తగ్గిస్తే ఇంకేమైనా ఉందా? కేవలం జమ్ముకాశ్మీర్‌ యాపిల్‌ పంట, ప్యాకింగ్‌, ఎగుమతులపై ఆధారపడి సుమారు 30 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 'భారత దేశపు యాపిల్‌ బుట్ట'గా పేరుగాంచిన జమ్ముకాశ్మీర్‌ గత ఏడాది సుమారు 21 లక్షల టన్నుల యాపిల్‌ పళ్లను ఉత్పత్తి చేసింది. ఇది దేశ ఉత్పత్తిలో 70 శాతానికంటే ఎక్కువ. యాపిల్స్‌తో జమ్ముకాశ్మీర్‌ సుమారు 14 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంత కీలకమైన పంట విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా జమ్ముకాశ్మీర్‌ ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేదన కలగడం సహజం. 'అమెరికా, ఇతర దేశాలను సంతోషపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ ప్రజలకు కష్టాలను కలిగిస్తోంది, వేదనలకు గురిచేస్తోంది' అని అక్కడి ప్రజలు భావించి మరింతగా పరాయీకరణ చెందుతారు.
          మోడీ సర్కారు చేస్తున్న నిర్ణయాలవల్ల కేవలం యాపిల్‌ రైతులేగాక వాల్‌నట్స్‌, బాదం తదితర సుగంధ ద్రవ్యాలు పండించేవారూ దెబ్బ తింటారు. ఇప్పటికే జీడి రైతులు కష్టాల్లో ఉన్నారు. తాజాగా కొబ్బరి రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను దేశంలో ప్రవేశపెట్టిన ఆనాటి పి.వి-మన్మోహన్‌ ప్రభుత్వం డంకెల్‌ ప్రతిపాదనల పేరిట ఎగుమతి ఆధారిత వ్యవసాయ విధానాలను అనుసరించాలని చెప్పింది. పర్యవసానంగా ఈ 30 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం కునారిల్లుతోంది. ఆనాటికంటే నేటి మోడీ సర్కారు మరింత తీవ్రంగా ఆ విధానాలను అమలు చేయడంతో మన పంటల ఎగుమతి సంగతి అటుంచి విదేశీ వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తడంతో భారతీయ రైతు దివాళా తీస్తున్నాడు. కాబట్టి దేశీయ వ్యవసాయం, రైతాంగం నిలబడాలంటే ఈ విధానాలు, వాటిని రుద్దుతున్న మోడీ సర్కారు పోవాలి. ఆ దిశగా సాగే ఉద్యమాలే అందరికీ దిక్సూచి !