9న మాక్ పోలింగ్ : డిఆర్ఓ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్ఓ

9న మాక్ పోలింగ్ : డిఆర్ఓ
రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్ఓ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాకు కేటాయించిన ఈవీఎంల మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి కావచ్చిందని, ఈనెల 9న గురువారం నాడు మాక్ పోలింగ్ నిర్వహించబడుతుందని గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొనవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ అన్నారు. బుధవారం డిఆర్ఓ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ ఓ సమావేశమయ్యారు. ఈసందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 9న గురువారం మాక్ పోలింగ్ నిర్వహించబడుతుందని ఈవీఎంలు, వివి ప్యాడ్ల పనితీరును పరిశీలించుకోవచ్చు అని అన్నారు. కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్లో ఈకార్యక్రమం నిర్వహించబడుతుందని అనుమతి ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావచ్చు అన్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు లేదా తీసివేతల విషయంలో వచ్చిన అభ్యర్థనలను క్షేత్రస్థాయిలో బిఎల్వోలు పరిశీలించి సంబంధిత క్లెయిములు పూర్తి చేయాలని అన్నారు. అభ్యర్థనలు వచ్చిన ఇంటికి వెళ్లకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం చేయకూడదని అలా చేస్తే చర్యలు తప్పవనన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా దరఖాస్తులను పంపడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు లేదా చేర్పుల విషయంలో రెండు శాతం పైగా ఒక ప్రాంతంలో నమోదు అయితే ఈఆర్వోలు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి తీసివేతలు మార్పులు చేర్పులకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, సురేంద్ర కుమార్, సిపిఎం నుంచి వాడ గంగరాజు, బీఎస్పీ నుంచి సురేంద్రబాబులతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.