
ప్రజాశక్తి -అనకాపల్లి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక కోడుగంటి గోవిందరావు భవనంలో గోడ పత్రికను ఆయా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ చేస్తున్న దీక్షలు నవంబర్ 8వ తేదీ నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలనే ఉద్దేశ్యంతో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందుకు పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చొరవ చూపాలని కోరారు. అలాగే విభజన హామీల్లో భాగంగా కడప స్టీల్ప్లాంట్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.బాబ్జి, జీ.ఫణీంద్ర కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.కన్నబాబు, వి.రాజు, పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాయుడు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.