
రోటరీ జిల్లా గవర్నర్ సుబ్బారావు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
రోటరీ సంస్థ ద్వారా 72 మంది చిన్నారులకు ఉచితంగా గుండె చికిత్స అందిస్తామని రోటరీ జిల్లా గవర్నర్ సుబ్బారావు తెలిపారు. రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు రొంగల దేవీప్రసాద్, కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్ తిలక్ ఆధ్వర్యంలో గవర్నర్ దత్తా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఉప్పలమెట్ట సాంఘిక సంక్షేమ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన సేవాకార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ చోడిపిండి సుబ్రహ్మణ్యం వితరణతో పది సీలింగ్ ఫ్యాన్లను గవర్నర్ దత్తా చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ సుబ్బారావు మాట్లాడుతూ గుండెలో పుట్టుకతోనే రంధ్రం ఉన్న 72 మంది చిన్నారులను గుర్తించి పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స అందిస్తామని తెలిపారు. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు రోటరీ జంగారెడ్డిగూడెం దృష్టికి తీసుకురావడం ద్వారా వైద్యసేవలు పొందవచ్చని రోటరీ జిల్లా 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు తెలిపారు. విద్యార్థి దశలో విద్యను నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ దాకారపు కృష్ణ, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ లోకేష్, దాత చోడిపిండి సుబ్రహ్మణం, ధనకుమార్, జిఎ.ప్రసాద్ పాల్గొన్నారు.