
24 లోపు జగనన్న విద్యా దీవెన పథకం లబ్దికి
ఉమ్మడి ఖాతా తెరవాలి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పథకం లబ్ధి కోసం సంబంధిత విద్యార్థి, తల్లి పేరుతో ఉమ్మడి ఖాతా తప్పనిసరిగా తెరవాలని ఈనెల 24వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఈ విషయంలో విద్యార్థులకు బ్యాంకుల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సంక్షేమశాఖల అధికారులు, బ్యాంకర్లతో నాలుగో విడత జగనన్న విద్యాదీవెన లబ్ధి పొందేందుకు అవసరమైన ఖాతాలు తెరిచే విషయంలో బ్యాంకర్లు తీసుకోవలసిన చర్యలపై తగు ఆదేశాలు ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు జగనన్న విద్యాదీవెన నాలుగో విడత లబ్ధి పొందేందుకు సంబంధింత విద్యార్థి, తల్లిపేరుతో ఉమ్మడిఖాతా తప్పనిసరిగా తెరిచే ప్రక్రియను ఈనెల 24వ తేదీ లోపు పూర్తి చేయాలని, ఇందుకు బ్యాంకర్లు వారి బ్యాంకులకు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందివ్వాలని అన్నారు. విద్యార్థి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటేనే జగనన్న విద్యాదీవెన నాలుగో విడత లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్సీ విద్యార్థులకు, 2022- 23 విద్యా సంవత్సరంలో డిగ్రీ, డిప్లొమా, బిటెక్, ఐటిఐ పూర్తిచేసిన విద్యార్థులకు ఉమ్మడిఖాతా అవసరం లేదన్నారు. బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, ఎస్టిలు ఉమ్మడి ఖాతా తెరవాలని తెలిపారు. ఉమ్మడి ఖాతా తెరిచేందుకు బ్యాంకులకు వచ్చిన విద్యార్థులకు బ్యాంకులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పూర్తిసహాయ సహకారాలు అందివ్వాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ బాష, ఎల్డిఎం హరీష్, వివిధ బ్యాంకుల అధికారులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.