Nov 08,2023 22:47

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: కమిషనర్‌

18 సంవత్సరాలు నిండిన
ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక పరిధిలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కొత్త ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఈఆర్వో, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ సూపర్వైజర్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక పరిధిలో ఓటు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై బుధవారం నగరపాలక కార్యాలయంలో సూపర్వైజర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జనవరి ఒకటి, 2024కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఇందుకోసం సూపర్వైజర్‌ అధికారులకు కేటాయించిన విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అక్కడికక్కడే అర్హులైన విద్యార్థుల చేత ఓటు హక్కు నమోదు దరఖాస్తులు చేయించాలన్నారు. విద్యాసంస్థల్లో రోజువారి కార్యక్రమాల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, సీఎంఎం గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి
నగరపాల సంస్థ పరిధిలో జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో జరుగుతున్న ఇళ్లనిర్మాణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హౌసింగ్‌ పురోగతిపై సూపర్వైజర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక పరిధిలోని అన్ని లేఅవుట్లలో ప్రస్తుతం జరుగుతున్న పనులు మరింత వేగవంతం చేయించాలన్నారు. బీఎల్‌, ఆర్‌ఎల్‌, ఆర్సీ దశలో ఉన్న నిర్మాణాలను డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తిచేయించేలా లబ్ధిదారులను సమన్వయం చేయాలన్నారు. రోజువారి నిర్మాణ పనులు జాప్యం లేకుండా చూడాలన్నారు. సీఎంఎం గోపి, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, సూపర్వైజర్‌ అధికారులు పాల్గొన్నారు.