Nov 09,2023 22:29

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వివిధ కారణాలతో పొగొట్టుకున్న సెల్‌ఫోన్లును చాట్‌బాట్‌ పోలీస్‌ యాప్‌ ద్వారా యజమానులకు అందజేసింది. దాదాపు రెండు కోట్లకు పైగా విలువ చేసే వెయ్యి సెల్‌ఫోన్లను పోలీస్‌శాఖ రికవరీ చేసిన్నట్లు అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్‌ వినియోగం ఎక్కువైందని, మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైతే ఎటువంటి కంప్లయింట్‌ లేకుండా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి చాట్‌ బాట్‌ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను మరల పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో మూడవసారి 300 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్‌ బాట్‌ బందం మొబైల్‌ ట్రాకింగ్‌ పై బాగా పని చేస్తున్నారన్నారు. పోయిన మొబైల్‌ ఫోన్లు మన రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, రాజాస్థాన్‌, ఢిల్లీ, కేరళ, బీహార్‌, పంజాబ్‌, మన జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల వాని మొబైల్‌ ఫోన్ల రికవరీ చేసి భాదితులకు అందజేసిన పోలీస్‌ సిబ్బంది పనితీరు హర్షనీయమని తెలిపారు. ఇంకా పెండింగ్‌ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలో రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని తెలియజేసారు. మొబైల్‌ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కషి చేస్తామని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు.
స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ ప్రభావతి దేవి ఆదేశాల మేరకు పిసిపి ఎన్‌డిటి నోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు చిత్తూరు నగర పరిధిలోని వివిధ స్కానింగ్‌ సెంటర్‌లను ఆకస్మిక తనిఖీ చేశారు. 'గర్భస్థ లింగ నిర్దారణ చట్టరీత్యా నేరం' నగర పరిధిలోని వివిధ స్కానింగ్‌ సెంటర్లను, హాస్పిటల్‌, న్యూమెట్రో హాస్పిటల్‌ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ గర్భవతులకు లింగ నిర్ధారణ తెలియపరచకూడదని, అలా తెలియజేసినట్లు రుజువైతే పిసిపిఎన్‌డిటి 1994ప్రకారం చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి రూ.10వేలు జరిమనా, మూడు సంవత్సరాల జైలు శిక్ష సదరు డాక్టర్‌కి, అక్కడ పనిచేసిన నర్సుకి, గర్భవతికి, వారి వెంట వచ్చిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ జార్జ్‌ పాల్గొన్నారు.