Jun 19,2022 11:47

వాన మెతుకులు (రాయలసీమ రైతు కథలు)
సంపాదకులు : ఇనాయతుల్లా - కెంగార మోహన్‌
ప్రచురణ : రాయలసీమ ప్రచురణలు, కర్నూలు
వెల : 250
ప్రతులకు : కెంగార మోహన్‌
ఇ.నెం. 43-238
ఫ్లాట్‌ నెం.102, ఎన్వీఆర్‌ ప్లాజా
రోడ్‌ నెం.8, ఎన్‌ఆర్‌ పేట, కర్నూలు - 518003
ఆంధ్రప్రదేశ్‌
ఫోన్‌ : 9490099059

రాయలసీమ చరిత్ర... సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ప్రత్యేకమైనది. ఇక్కడి భాషలోనూ ప్రత్యేకమైన మాండలికం వుంది. ఇతర ప్రాంతాలకు భిన్నంగా వుంటుంది. తరతరాలుగా ఈ ప్రాంతపు వ్యవసాయం వర్షాధారితమే. ఇక్కడి ప్రజల జీవన విధానం, కక్షలు, అనుబంధాలు, కరువు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు... వీరి జీవన వైవిధ్యంలోని విభిన్నాంశాలు, సున్నితమైన, సునిశితమైన విషయాలను విశ్లేషిస్తూ వెలువడిన సాహిత్యం మరింత ప్రత్యేకమైనది. అంతరించిపోతున్న వృత్తులు, నీటి సమస్య, వర్షాల్లేక, పంటలు పండక.. మంచినీటికి సైతం కటకటలాడటం, విచ్ఛిన్నమౌతున్న గ్రామీణ జీవనం వంటి అనేక జీవన చిత్రాలు ఇక్కడ సాహిత్యంలో తారసపడతాయి. అది కథ అయినా, కవిత అయినా.. మరే సాహిత్య ప్రక్రియ అయినా.. నీరు, కరువు, ఛిద్రమైపోతున్న గ్రామీణ్యం అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది. బీడుపడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడుతుండే గ్రామాలు వున్న రాయలసీమలో వ్యవసాయం 'జూదం'లా వుంటుందని అక్కడి రైతులు చెబుతుంటారు. రైతుల చుట్టూ కరువు, ధరల్లేకపోవడం వంటి అనేక ఉచ్చులు రైతుల చుట్టూ బిగుసుకొని వుంటాయి.
     నిజానికి రాయలసీమ రైతు కథలు అనగానే.. ఏవో కొన్ని అపోహలతో కొట్టుకుపోయేవారికి.. ఈ కథల్లోని వస్తు వైవిధ్యం, కథల్లోని వాస్తవిక పాత్రలు మన కళ్ల ముందు సజీవంగా నిలిపిన వైనం అబ్బురపరుస్తుంది. విస్మయానికి గురిచేస్తుంది. ఇనాయతుల్లా- కెంగార మోహన్‌ సంపాదకత్వంలో వెలువడిన 'వానమెతుకులు' రాయలసీమ రైతు కథల సంకలనంలోనూ అదే విస్తృతి, అదే విలక్షణత సజీవ సాక్ష్యాలుగా పఠితుల మనసులపై ముద్రితమౌతాయి. 18 కథలున్న ఈ పుస్తకంలో.. ఒక్కో కథ.. ఒక్కో జీవనచిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకంలోని తొలి కథ 'వానమెతుకులు'. స్వతహాగా కవి అయిన కెంగార మోహన్‌.. ఒక్కోవాక్యాన్ని ఒక్కో కవితా పాదంగా మలిచారు. 'చలి మనిషినే కాదు మనసునీ గాయం చేస్తున్నట్లుంది' అంటూ కథ ప్రారంభిస్తారు. ఉన్న ఊరిని.. చెట్టు చేమ అన్నీ వదులుకుని, బతుకుదెరువు కోసం వలస పోయే జీవితాల్లోని చీకటి కోణాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. ఈ వలస ధాటికి బాల్యం, చదువులు ధ్వంసమైపోతున్న వైనం, వలసకు తీసుకుపోయే లారీ ఎక్కుతున్న హనుమంతు కుటుంబం.. ఏడోతరగతి చదివే హారికను చూసి, కళ్ల నీళ్లుపెట్టుకునే స్నేహితులు, పిల్లలకు పాఠాలు చెప్పే సాధారణ మాస్టారు.. వాళ్ల బతుకులు మార్చే శక్తి లేక నిస్సహాయంగా చూస్తుండిపోయిన దృశ్యం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
     'పెన్నేటి బతుకు' ఒక రైతు కన్నీటి కథ. రమణయ్యకు పదెకరాల మెట్టభూమి వుంది. వానొస్తే పండేది. రాకుంటే ఎండేది. ఏయేటికాయేడు పంటలు పండక, అప్పు తెచ్చిన చోట వడ్టీ కట్టలేక సతమతమయ్యేటోడు. తన మెట్టభూమిని అమ్మేసి, నీటి వసతి వున్న భూమిని కొనాలనుకుంటాడు. నీటి వసతి వుంటే కనీసం కూరగాయలు అమ్ముకునైనా బతకొచ్చని ఆశపడతాడు. ఈ క్రమంలో పెన్నానది ఒడ్డున ఐదెకరాలు నీటివసతి గల పారంబోకు భూమిని కొంటాడు. ఈ భూములకు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు వుండవు. పంట నష్టపోతే... ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వదు. అయినా పంట పండితే చాలునని ఆ భూమిని కొంటాడు రమణయ్య. పైరు వేస్తాడు. బాగా పండుతుంది. ఈ ఏడు అప్పులన్నీ తీర్చేయొచ్చని ఆశపడతాడు. అకస్మాత్తుగా పెన్నేటికి వరదలు వస్తాయి. నది ఒడ్డున వున్న రమణయ్య పొలంలోని పంట మొత్తం మునిగిపోతుంది. నీట మునిగిన పొలంలోని పంట మొత్తం కొట్టుకుపోవడం చూసిన రమణయ్య.. ఆ పంటను కాపాడుకోవాలన్న తపనతో నదిలో దూకేస్తాడు.. సుడిగుండంలో కూరుకుపోతాడు. మనసును మెలిపెట్టే ఈ కథ.. ప్రతి మనిషినీ హత్తుకుంటుంది.
     అలాగే ఈ పుస్తకంలోని ఏ ఒక్క కథ కూడా కాలక్షేపానికి చదువుకునేది కాదు. రాయలసీమ రైతుల జీవితాన్ని చదివించే కథలు. ఒక్కో కథ ఒక్కో ఇతివృత్తం.. నడుస్తున్న జీవనచిత్రం. కథలన్నింటిలోనూ చక్కని శిల్ప వైవిధ్యం పఠితులను ఆసాంతం చదివిస్తుంది. ప్రతి ఇంటా లైబ్రరీలో వుంచుకోదగ్గ పుస్తకం ఇది. నేటి తరానికి రైతును, రైతు జీవితాన్ని పరిచయం చేయడానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం 'వానమెతుకులు'.
 

- రాజాబాబు కంచర్ల