Jun 12,2022 14:16

'క్షణం, గుఢాచారి, ఎవరు' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అడివి శేష్‌. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్‌ హిట్టే. తాజాగా 26/11 రియల్‌ హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మేజర్‌' చిత్రంలో హీరోగా నటించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుడి బయోపిక్‌ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శశి కిరణ్‌ తిక్కా దీనికి దర్శకత్వం వహించారు. అనౌన్స్‌మెంట్‌ రోజు నుంచి
అంచనాలను పెంచుకుంటూ వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? అనే విషయాలను తెలుసుకుందాం..!

కథలోకి వెళ్తే.. సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ (అడివి శేష్‌) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో జీవిస్తుంటాడు. కానీ అతని తండ్రికి (ప్రకాశ్‌ రాజ్‌) కొడుకుని డాక్టర్‌ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్‌ చదివించాలని ఉంటుంది. కానీ చిన్పప్పటి నుంచి నేవీలో చేరాలనే కోరిక సందీప్‌లో రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఓసారి నేవీ ఎగ్జామ్స్‌ పాసైనప్పటికీ ఇంటర్వ్యూలో సెలక్ట్‌ కాలేకపోతాడు. ఆ సమయంలో ఆర్మీలో జాయిన్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. చివరికి కొడుకు ఆశయాలకు, ఆలోచనలకు వాళ్ల ఇష్టాన్ని చంపుకుంటారు. సోల్జర్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సందీప్‌.. ఆ దిశగా కష్టపడి ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. ఈ క్రమంలో స్కూల్‌ డేస్‌లో ఇష్టపడిన ఇషా (సయీ మంజ్రేకర్‌) ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరి మధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకూ వెళతారు.
మరోవైపు ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్‌.. అంచెలంచెలుగా ఎదిగి, భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్‌ఎస్‌జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఓసారి తను ఇంటికి వెళ్లేందుకుపై అధికారి (మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని, బెంగళూరు బయలుదేరుతాడు సందీప్‌. అదే సమయంలో ముంబై తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని '51 ఎస్‌ఎస్‌ జీ' బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్‌ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్‌ ఎలా మట్టుపెట్టాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే మిగతా కథ..
2008లో ముంబైలో నవంబర్‌ 26న జరిగిన ముష్కరుల దాడుల నేపథ్యంలో ఇప్పటికే అనేక వెబ్‌సిరీస్‌లు, చిత్రాలూ తెరకెక్కించారు. వాటన్నింటినీ చూసిన ప్రేక్షకులకు మేజర్‌ సినిమాలో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తాజ్‌ హోటల్‌లో చిక్కుకున్న హోస్టేజెస్‌ను ఎలా రక్షించాడనేనది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. ఈ సినిమా మొత్తాన్ని మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తండ్రి ఫ్లాష్‌ బ్యాక్‌లో ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేశాడు. ముంబై దాడుల్లో మేజర్‌ ఉన్నికృష్ణ ఎలా వీరమరణం పొందారో అందరికీ తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడో ఈ సినిమాలో చూపించారు. మధ్యలో హీరో, హీరోయిన్స్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ కాస్త ఇబ్బంది పెడుతోంది.
ఇక ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతిదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. హోటల్‌లో ఉన్న సాధారణ యువతి ప్రమోదరెడ్డి (శోభిత ధూళిపాళ), ఓ చిన్న పిల్లను కాపాడడం కోసం పడిన పాట్లు ఆకట్టుకుంటాయి. ప్రాణాలు పోతాయని తెలిసినా.. సందీప్‌ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోటుకు వెళ్లడం.. అక్కడివారితో జరిపిన వార్‌... ఒంటినిండా బుల్లెట్లు, కత్తిపోట్లు ఉన్నా.. చివరి క్షణం వరకు దేశరక్షణ కోసమే పాటుపడడం.. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ స్పీచ్‌.. ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ బాగా నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో మౌల్డ్‌ అయిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం ఎన్‌ఎస్‌జి కమెండో తీసుకోవాల్సిన శిక్షణ తీసుకున్నాడు. దాని కోసం బాగానే శరీరాన్ని కష్టపెట్డాడు. ఆ ఫలితం తెరపై కనిపిస్తోంది. ఇక హీరోయిన్‌గా నటించిన సాయి మంజ్రేకర్‌, శోభితా ధూళిపాళ్ల ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో నటించిన ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వారి పరిధి మేరకు నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీచరణ్‌ పాకాల సంగీతం. నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పవన్‌కల్యాణ్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. మొత్తంగా 'మేజర్‌' అందరూ చూడాల్సిన సినిమా.
టైటిల్‌ : మేజర్‌
నటీనటులు : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ, తదితరులు
నిర్మాత : మహేశ్‌బాబు, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర
దర్శకుడు : శశి కిరణ్‌ తిక్క
సంభాషణలు : అబ్బూరి రవి
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫి : వంశీ పచ్చిపులుసు
ఎడిటర్‌ : విజరు కుమార్‌, పవన్‌ కల్యాణ్‌
విడుదల తేదీ : జూన్‌ 3, 2022