Aug 29,2023 16:32

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ప్రభుత్వం అప్పగించిన పనులను ఇష్టపూర్వకంగా చేస్తే విజయం సాధ్యమవుతుందని జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ఉప్పాల హారిక పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జెడ్పి కన్వెన్షన్‌ హాలులో పంచాయతీ కార్యదర్శుల 6 రోజుల పున్ణశ్చరణ శిక్షణా కార్యక్రమానికి జడ్పీ చైర్‌ పర్సన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే కష్టంగా కాకుండా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు విజయవంతం అవుతుందన్నారు. తద్వారా మెరుగైన పలితాలు సాధించవచ్చని తెలిపారు. ఉద్యోగం చిన్న పెద్ద ఏదైనా సరే పల్లెల్లో నిరక్షరాశ్యలు వారి సమస్యల పరిష్కారం కోసం సంప్రదించినప్పుడు వారి విన్నపాలను ఓపిగ్గా విని చేతనైనంత సహాయం చేయాలన్నారు. విధి నిర్వహణలో వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ధ్యానం చేయాలని, ధ్యానం ద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అప్పగించే పనులను తప్పనిసరిగా చేయవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న శిక్షణ ఉద్యోగ జీవితంలో గుర్తుండి పోయేలా ఉండాలన్నారు. గ్రేడ్‌, క్యాడర్‌ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం, స్వచ్ఛభారత్‌ మిషన్‌, జగనన్న పల్లె వెలుగు తదితర అన్ని పథకాలలో భాగస్వాములై మంచి ఫలితాలు సాధించి మన్ననలు పొందాలన్నారు.జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మేధస్సుకు పదును పెట్టి సామర్థ్యం పెంపొందించుకొని స్మార్ట్‌గా తయారు కావాలన్నారు. ఉద్యోగం రానంతవరకు రాత్రింబవళ్లు కష్టపడతామని అదే వచ్చాక విశ్రమించక తెలియని విషయాలను తెలుసుకుంటూ ఉండాలన్నారు. ప్రభుత్వం రోజురోజుకు ఇచ్చే పనులు పెరుగుతున్నాయని దాంతో భౌతికంగా ప్రతి ఒక్కరిలో సామర్ధ్యాలు తగ్గిపోతున్నాయన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా పంచాయతీ రాజ్‌ చట్టము, ప్రవర్తన నియమావళి, జిల్లా కార్యాలయ మ్యానువల్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అర్థం చేసుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా విధులు నిర్వహించాలన్నారు. వ్యవస్థలో ఉండి వ్యవస్థలో ఉన్న విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఎంతగా కష్టపడి పనిచేస్తారో అంతగా విజయం సాధిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వాటిని సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌ వి. నాగేశ్వర్‌ నాయక్‌, శిక్షకులు ఈ ఓ పి ఆర్‌ డి లు, పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.